కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని, అరాచక శక్తులు పెచ్చుమీరుతున్నాయని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో ఎంతో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మహిళలపై దాడులు, రాజకీయ వేధింపులు, నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధమున్న KLSR ఇన్ఫ్రాటెక్ సంస్థ ద్వారా సాగుతున్న బినామీ లావాదేవీలపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సంస్థ ద్వారా భారీ ఎత్తున నిధుల మళ్లింపు జరుగుతోందని, ఇందులో ముఖ్యమంత్రి బినామీల ప్రమేయం ఉందని ఆరోపణలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ అమిత్షా (Amit Shah)ను కోరారు.

