కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలో సంచలనం సృష్టించిన ఆర్ఎంపి వైద్యుడిపై దాడి, చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ఐదుగురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కారు, బంగారు గోలుసు, మొబైల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పెనుగొండ అబినైజర్ (19), పంబాల నాగరాజు (19), గుజ్జేటి మధువర్ధన్ (19), మాచర్ల రామ్ చరణ్ గౌడ్ (19), మరో మైనర్ జల్సాలకు అలవాటు పడి పలువురి నుంచి చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు. ఘటనలపై కరీంనగర్ (Karimnagar) సీపీ గౌస్ ఆలం ఆదేశాలతో ఏసీపీ, తిమ్మాపూర్ సీఐ, సిబ్బంది దర్యాప్తు చేపట్టి శుక్రవారం తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన ఏసీపీ కరీంనగర్ రూరల్ విజయ కుమార్, తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్, ఎల్ఎండి కాలనీ ఎస్ఐ అన్వర్, కానిస్టేబుళ్లు రాఘవ, ఆకాష్, అనిల్ కుమార్లను సిపి అభినందించారు.

