కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా యుద్ధం ఏ మాత్రం తగ్గట్లేదు. రోజురోజుకూ భీకరంగా యుద్ధం సాగుతోంది. ఇరాన్ వర్సెస్ అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం పీక్స్ లోకి వెళ్లిపోయింది. ఇప్పటి వరకు వేల మంది మరణిస్తున్నారు. ప్రపంచ దేశాలు క్రూడ్ ఆయిల్, గ్యాస్ సంక్షోభంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఇలాంటి సమయంలో యుద్ధం ఆపాలని ప్రపంచం కోరుకుంటుంటే.. ఇరాన్, అమెరికా మాత్రం తగ్గేదే లే అన్నట్టు పరస్పర వార్నింగ్ లు ఇచ్చుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ఇరాన్ కు భారీ హెచ్చరిక చేశారు.
ఇరాన్ నేతలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే ఈరోజు ఏం చేస్తామో ప్రపంచం చూస్తుందని.. మరింత భయంకరంగా దాడులు చేస్తామని తెలిపారు ట్రంప్ (Donald Trump). ‘అమెరికా చేసిన దాడుల్లో ఇరాన్ నౌకాదళం పూర్తిగా నాశనం అయింది. మరికొన్ని రోజుల్లోనే వారి వైమానిక వ్యవస్థ కూడా కనిపించకుండా పోతుంది. ఇరాన్ దగ్గర చెప్పుకోడానికి ఏమీ మిగల్లేదు. ప్రపంచంలో ఏ దేశానికి జరగనంత నష్టం ఇరాన్ కు మేం చేశాం. 47 ఏళ్లుగా ప్రజలను చంపుతున్న వ్యక్తిని అమెరికా 47వ అధ్యక్షుడిగా నేను అంతమొందించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు.

