కలం, వెబ్ డెస్క్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ కొరత (Gas Shortage)పై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, వాస్తవాలు చెప్పకుండా మభ్యపెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. గ్యాస్ కొరతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా గన్ పార్క్ నుండి నిరసన తెలుపుతూ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కేటీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. దీనికి ముందు కేటీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుందని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. గోడౌన్ల వద్ద ప్రజలు భారీ క్యూలైన్లు కడుతున్నారని, ఉదయం నుంచి వేచి చూసినా గ్యాస్ దొరకడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం సహకరించడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు.
కేంద్రం కొన్ని రాష్ట్రాల్లో రాబోతున్న ఎన్నికల నేపథ్యంలో మే 4 వరకు వేచి చూసి, తర్వాత సిలిండర్ సైజ్ కూడా 12 కేజీల నుండి 10 కేజీలకు తగ్గించాలని చూస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. గ్యాస్ కొరతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు వెంటనే స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టినట్లు చెప్పారు.గ్యాస్ సరఫరాలో ఏవైనా ఇబ్బందులు ఉంటే కేంద్రం ఇతర ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరారు. యుద్ధం నేపథ్యంలో సదరు దేశాల నుంచి సరఫరా జరగకపోతే ఇతర మార్గాలు అన్వేషించాలన్నారు.

