కలం, వెబ్ డెస్క్: నీట్ పరీక్ష లీక్ కావడమే కాకుండా 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలను అంధకారంలో నెట్టేలా పరీక్షనే రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ‘పగలు, రాత్రి కష్టపడి చదివిన ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోంది. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం చేతకాని ఎన్డీఏ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే మరోసారి పేపర్ లీక్ అయింది. 2024లో కూడా ఇలాగే నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయినా.. ఆ ఘటన నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వలనే ఈ పరిస్థితి దాపురించింది. జాతీయ అర్హత పరీక్ష నిర్వహణలో ఏజెన్సీల అసమర్థత విద్యార్థుల పట్ల శాపంగా మారింది’ అని మండిపడ్డారు.
ఎవరి హస్తం ఉందో తేల్చాలి..
పరీక్షకు రెండు రోజుల ముందే ఏకంగా వందకు పైగా ప్రశ్నలు లీక్ కావడం వ్యవస్థలో ఉన్న దారుణమైన లోపాలను బయటపెట్టిందని కేటీఆర్ దుయ్యబట్టారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారాన్ని అత్యంత సీరియస్గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. దీని వెనుక ఎవరి హస్తం ఉన్నా, కఠినంగా శిక్షించాలని సూచించారు. నీట్ పేపర్ లీకేజీకి పూర్తి బాధ్యత వహించి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సాధ్యమైనంత త్వరగా మళ్లీ నీట్ పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని సూచించారు.

