కలం, వెబ్ డెస్క్: వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రీడలకే తాము అగ్రతాంబూలం ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘ప్లేయర్స్ కాంక్లేవ్ (Players Conclave)’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు బాస్కెట్బాల్ క్రీడ అంటే ప్రాణమని, తాను ఈ ఆటకు వీరాభిమానినని పేర్కొన్నారు. తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఏర్పాటైన నాటి నుండి క్రీడాకారుల సంక్షేమం కోసం, క్రీడల ప్రోత్సాహం కోసం నిరంతరం కృషి చేస్తూ మంచి కార్యక్రమాలు చేపడుతోందని ఆయన ప్రశంసించారు. గత పాలనలోని ప్రాధాన్యతలను వివరిస్తూ, తాము అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర అవసరాల దృష్ట్యా వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పన, ఐటీ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని కేటీఆర్ తెలిపారు.
క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ, క్రీడాకారులకు అవసరమైన అన్ని రకాల వసతులు, ప్రోత్సాహకాలను అందించి రాష్ట్రాన్ని క్రీడా హబ్గా మారుస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. క్రీడాకారుల ప్రతిభను మరింతగా వెలికి తీయడంలో కొన్ని పరిమితులు ఎదురయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు ప్రణాళికలపై ధీమా వ్యక్తం చేస్తూ, 2029లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే పర్యాయం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్రీడలను తమ ప్రధాన ఎజెండాలో చేర్చుతామన్నారు.

