మహిళతో కొడుకు జంప్​.. తండ్రికి యూరిన్ తాగించిన మహిళ బంధువులు

కలం, వెబ్​ డెస్క్​ : ఒక యువకుడు, ఒక మహిళ ప్రేమించి పారిపోయారనే కోపంతో, సదరు యువకుడి తండ్రిపై మహిళా బంధువులు అమానుషంగా దాడి చేసి బలవంతంగా మూత్రం తాగించారు. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని రైసెన్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకున్నది. రైసెన్ జిల్లాలోని అగారియా మార్ఖో గ్రామానికి చెందిన బిహారీ బంజారా (70) కొడుకు, పొరుగున ఉన్న విదిశ జిల్లాలోని శంషాబాద్‌కు చెందిన ఒక మహిళతో కలిసి కొన్ని రోజుల కింద పారిపోయాడు. ఈ విషయంపై ఆగ్రహంతో ఉన్న మహిళా బంధువులు ఆ యువకుడి కుటుంబంపై పగ పెంచుకున్నారు. దాదాపు 10 నుంచి 12 మంది వ్యక్తులు ఆయుధాలతో బిహారీ బంజారా ఇంటిపై దాడి చేశారు.

ఆ సమయంలో ఇంట్లో ఉన్న బంజారా, అతని భార్యను తీవ్రంగా కొట్టారు. అనంతరం మహిళ ఎక్కడ ఉందో చెప్పాలని డిమాండ్ చేస్తూ, 70 ఏళ్ల ఆ వృద్ధుడిని బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్‌గఢ్ జిల్లాలోని బియోరా పట్టణానికి తీసుకెళ్లారు. అక్కడ ఒక నిర్జన ప్రదేశంలో అతన్ని కట్టేసి క్రూరంగా హింసించారు. ఆ వృద్ధుడు ఎంత వేడుకున్నా వినకుండా, ఒక బాటిల్‌లో ఉన్న మూత్రాన్ని ఆయనతో బలవంతంగా తాగించారు. ఈ దారుణాన్ని నిందితులు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం బయటపడింది. బాధితుడు బిహారీ బంజారా ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు. తనపై జరిగిన దాడిని, అవమానాన్ని వివరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>