కలం, వెబ్ డెస్క్: త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 1000 మంది పార్టీ కార్యకర్తలకు ఈ శిక్షణ ఇస్తామని ప్రకటించారు. ఈసారి సభ్యత్వం పూర్తిగా డిజిటల్ రూపంలో ఉంటుందని తెలిపారు. ముందుగా సభ్యత్వ నమోదు, తర్వాత శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. దీనితో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు, అన్యాయాలు, ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి మోసం చేసిందని.. దీనిపై కూడా అవగాహన కల్పిస్తామని అన్నారు. హైదరాబాద్ లోని అంబర్పేటలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు..
కాంగ్రెస్ పార్టీపైన ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ (KTR) అన్నారు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుదామని ప్రజలు చూస్తున్నారని చెప్పారు. ప్రజలు ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో సగం పూర్తయినా ఇప్పటిదాకా ప్రజలకు గాని, రాష్ట్రానికి గాని కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేక చేతులెత్తేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు, పరిపాలనా వైఫల్యాలు, అవినీతిపైన ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు.
Read Also: ఆమెకు రక్షణేది..?
Follow Us On : WhatsApp

