కలం, వెబ్ డెస్క్: దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట వద్ద గతేడాది నవంబరులో ఉగ్రవాదులు జరిపిన పేలుళ్ల వెనుక అనేక సంచలన విషయాలను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) వెలుగులోకి తీసుకొచ్చింది. ఎన్ఐఏ కోర్టుకి సమర్పించిన 7,500 పేజీల అభియోగపత్రంలో పేలుళ్ల కుట్రను పూర్తిగా వివరించింది. ఈ దాడికి ప్రధాన సూత్రధారి జాసిర్ బిలాల్ వనీ యూపీలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీని కేంద్రంగా ఎంచుకుని వ్యూహరచన చేశాడు. అందులో ముగ్గురు డాక్టర్లను తన వద్ద నియమించుకుని కుట్రకు తెరలేపాడు. కొన్ని నెలల పాటు క్యాంపస్ హాస్టల్లోనే ఉంటూ.. ఈ దాడికి రూపకల్పన చేయడం గమనార్హం. ఈ వ్యవహారంలో యూనివర్సిటీ నిర్వాహకుల పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఇప్పటికే ఈ యూనివర్సిటీ గుర్తింపును యూజీసీ రద్దు చేసింది.
ఏఐ ఉపయోగించి పేలుడు పదార్థాల తయారీ..
పేలుడు పదార్థాలు తయారు చేసేందుకు జాసిర్ బిలాల్ వనీ ఏఐని ఉపయోగించుకున్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. యూట్యూబ్, చాట్ జీపీటీలో పలుమార్లు వీటి గురించి సెర్చ్ చేశాడని గుర్తించాడు. రాకెట్లు ఎలా తయారు చేయాలి.. పేలుడు పదార్థాలను ఎలా మిక్సింగ్ చేయాలనే అంశాలను తెలుసుకుని.. దాడికి రూపకల్పన చేశాడు. ఇతడికి సహకరించిన యూనివర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్ ఉమర్, డాక్టర్ ముజామ్మిల్, డాక్టర్ అదీల్ ఐఈడీలను సేకరించడం గమనార్హం.

