కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ (BRS) పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి తలసాని నివాసంలో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ నేతలతో నేడు కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని, ప్రజల్లో ఆ పార్టీ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇప్పుడు ఎన్నికలు జరిగినా 78 సీట్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వయంగా చేపించిన సీక్రెట్ సర్వేలోనే వెల్లడైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సగం పాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సర్వే చేయించుకున్నారని కేటీఆర్ తెలిపారు. ఈ సర్వే కోసం రెండు మీడియా సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాయన్నారు. అందులో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత స్పష్టమైందన్నారు. మళ్లీ కేసీఆర్నే సీఎంగా చూడాలని ప్రజలు భావిస్తున్నట్లు సర్వేలో వెల్లడైందన్నారు.
సర్వే ఫలితాలు తట్టుకోలేక సీఎం సహనం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. అందులో భాగంగానే కాళేశ్వరం సహా బీఆర్ఎస్ చేసిన ప్రతి మంచి పని పైనా లేనిపోని ఆరోపణలు చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా ప్రయోజం లేదని, ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చుకోలేక జరగాల్సిన నష్టం జరిగిపోయిందని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై పూర్తిగా నమ్మకం కోల్పోయారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే అధికారమని స్పష్టం చేశారు.

