కలం, వెబ్ డెస్క్: పల్లెల్లో ఉదయాన్నే వాకిట్లో ఆవు పేడతో కళ్లాపి చల్లి, పిండితో అందమైన ముగ్గులు పెట్టి ముంగిళ్లను అలంకరించుకుంటారు. రోజులు గడుస్తున్న కొద్దీ కొన్ని పల్లెల్లో ఆవులు, బర్రెలను పెంచడమే మానేశారు. ఇక కళ్లాపి చల్లేందుకు పేడ ఎక్కడి నుంచి వస్తుంది. అప్పుడే మార్కెట్లోకి కళ్లాపి పౌడర్లు (Kallapi Powder) ఎంట్రీ ఇచ్చాయి. ఇవి సిటీతో పాటు, ఊర్లలో కూడా విరివిగా లభ్యమవుతున్నాయి. పౌడర్ను నీటిలో కలపగానే నీళ్లన్నీ పసుపు రంగులోకి మారిపోతాయి. ఇక ఆ నీటినే వాకిట్లో చల్లుకొని ముగ్గులు పెట్టుకుంటున్నారు. అయితే వీటి గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వాకిలిని అందంగా మార్చే కళ్లాపి పౌడర్ వెనుక మనుషులు ప్రాణాలు తీసే విష రసాయనాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.
ఈ రసాయనాలు కలిపిన కళ్లాపి పౌడర్ను దీర్ఘ కాలం వినియోగిస్తే ఇంట్లో ఉండే వారికి ఊపిరితిత్తులు దెబ్బతింటాయని అధికారులు తెలిపారు. దీని నుంచి వచ్చే వాసన పీల్చుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఈ పొడి నీళ్లు తాగి ఎంతో మంది ఆత్మహత్యకు ప్రయత్నించారని, 19 మంది ప్రాణాలు కూడా కోల్పోయారని వెల్లడించారు. ఇలాగే ఏపీలో జరిగిన పలు ఆత్మహత్యలపై విచారణ చేపట్టగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరు (Proddatur)లో గత ఏడాదిన్నర కాలంలో 19 మంది శ్రీ సౌభాగ్య కళ్లాపి పొడి నీళ్లు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అధికారులు ఈ పొడిలో ఏముందని తెలుసుకోవడానికి ల్యాబ్ టెస్టులకు పంపించారు. ఈ ల్యాబ్ రిపోర్టు చూసిన అధికారులు షాకయ్యారు. కళ్లాపి పొడిలో ఆరమైన-ఓ అనే రసాయనాన్ని వాడుతున్నారని గుర్తించారు. ఈ పొడి పీల్చినా, చర్మంపై పడినా, కడుపులోకి చేరినా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపెట్టారు. దీంతో ప్రొద్దుటూరులో శ్రీ సౌభాగ్య కళ్లాపి పొడి కంపెనీకి చెందిన ఐదు యూనిట్లను అధికారులు సీజ్ చేశారు. దుకాణాదారులు ఎవరూ దీని అమ్మకాలు చేపట్టవద్దని, ప్రజలు ఎవరూ ఇంట్లో దీన్ని వినియోగించవద్దని హెచ్చరించారు.

