కలం, వెబ్ డెస్క్: జగన్ మావిగన్ (MAVIGUN) అంటూ కొత్త రాజకీయం చేస్తున్నాడని మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) విమర్శించారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా తిరుపతి నగరంలోని కేశవాయణగుంట, బైరాగిపట్టెడలో ఉన్న జగ్జీవన్ రామ్ పార్క్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. అసలు జగన్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకైనా అర్థం అవుతుందా అని ప్రశ్నించారు. వింత వింత మాటలు మాట్లాడుతూ జగన్ ఒక కామెడీ పీస్ అయిపోయాడన్నారు. ఇక పేర్ని నాని అధికారులను పేర్లు మెన్షన్ చేసి బెదిరించడం సరికాదన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. పేర్లతో పాటు, కులాలతో అధికారులను దూషించే సంస్కృతి రాష్ట్రంలో ఎన్నడూ లేదన్నారు.
అధికారులు వాళ్ల రూల్స్ ప్రకారం వారు పని చేస్తారని, వాళ్లను టార్గెట్ చేసి వేధించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వైసీపీ అధికారులను వేధించే నీచ స్థాయికి దిగజారుతోందని, ఇలాంటి వాటిని ఉపేక్షించే పరిస్థితే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని మంత్రి రవీంద్ర (Kollu Ravindra) చెప్పారు. దేశంలోని అన్ని వర్గాలు, పక్షాల ఏకగ్రీవ ఆమోదంతో నేడు అమరావతికి (Amaravati) చట్టబద్ధత తీసుకొచ్చామని చెప్పారు. అందరూ ఆమోదించిన అమరావతిని వైసీపీ (YCP) మాత్రం వ్యతిరేకించి, ఆ పార్టీ ఎంపీలు సభలో నుంచి వాకౌట్ చేశారన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలను మరింత అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు.
Read Also: కడప జిల్లా వేంపల్లిలో ఆర్టీసీ బస్సుకు మంటలు
Follow Us On: Sharechat

