కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ప్రజావాణిలో అర్జీదారుల నుండి వచ్చిన దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Mahabubnagar Collector Khushboo Gupta) అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ హరిప్రియ తో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
ప్రతి సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ ప్రజా వాణిలో మున్సిపల్, పంచాయతీరాజ్, జిల్లా సంక్షేమం, వ్యవసాయం, పౌరసరఫరాల శాఖ, భూ సర్వే రికార్డులు, గృహ నిర్మాణం, రోడ్డు రవాణా, పోలీస్, గిరిజన అభివృద్ధి శాఖ, ప్రణాళిక శాఖ, విద్యుత్ శాఖ, విద్య, వైద్య ఆరోగ్యం , అటవీ, గ్రామీణ అభివృద్ధి, తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 132 వినతులను అధికారులు స్వీకరించారు.
ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీలో సభ్యత్వ నమోదు చేసుకోవాలి..
వివిధ శాఖలలో పనిచేస్తున్న జిల్లా అధికారులు, సిబ్బంది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వం నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా పిలుపునిచ్చారు. సోమవారం, ప్రజావాణి అనంతరం నిర్వహించిన జిల్లా అధికారుల సమావేశంలో మాట్లాడుతూ అధికారులందరూ తప్పనిసరిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లో లైఫ్ మెంబర్ రూ.1000 చెల్లించి సభ్యత్వం నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో సభ్యత్వ సంఖ్యను పెంచడంతో పాటు రెడ్ క్రాస్ నిర్వహిస్తున్న రక్త బ్యాంకులు, పేద విద్యార్థులకు ఉన్నత విద్యా కోసం ఆర్థిక సహాయం వంటి మానవతా సేవా కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యమని ఆమె వివరించారు.

