కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్, సోమశిల, శ్రీశైలం పుణ్యక్షేత్రాలను అనుసంధానిస్తూ ఏప్రిల్ 9వ తేదీ గురువారం నుంచి హెలికాప్టర్ టూరిజం సేవలు ప్రారంభం కానున్నాయి. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమశిలలో హెలిప్యాడ్ నిర్మాణం, ఇతర ఏర్పాట్లను పరిశీలించి ఈ విషయాన్ని వెల్లడించారు. కృష్ణా నది అందాలు, నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆకాశం నుంచి వీక్షించే అద్భుతమైన అనుభూతిని ఈ పర్యటన పర్యాటకులకు అందించనుంది. ప్రైవేట్ ఏవియేషన్ సంస్థల సహకారంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం నిర్వహిస్తోంది.
ఈ పర్యటన హైదరాబాద్లో ప్రారంభమై మొదట సోమశిలకు చేరుకుంటుంది. అక్కడ పర్యాటకులు కృష్ణా నది బ్యాక్ వాటర్స్లో బోటింగ్ ఎంజాయ్ చేస్తారు. అనంతరం శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శనం ఉంటుంది. అదే రోజు సాయంత్రానికి తిరిగి హైదరాబాద్ చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. భవిష్యత్తులో నాగార్జున సాగర్, రామప్ప ఆలయం, నిజాం సాగర్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు కూడా ఇలాంటి హెలికాప్టర్ సేవలను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

