కలం, సంగారెడ్డి : కోహిర్ (Kohir) మున్సిపాలిటీ పరిధిలో వంటగ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు అష్టకష్టాలు పడుతున్నారు. గత వారం రోజులుగా ఈ ప్రాంతంలో గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో సామాన్య ప్రజలు వంట చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా గ్యాస్ సిలిండర్ల లోడ్ వస్తుందనే సమాచారం తెలియడంతో, వినియోగదారులు పెద్ద సంఖ్యలో గ్యాస్ గోదాం వద్దకు చేరుకున్నారు.
ముందస్తుగా గ్యాస్ పొందాలనే ఆత్రుతతో వందలాది మంది ప్రజలు రాత్రి నుండే గోదాం ఎదుట క్యూ కట్టారు. సుమారు 600 ఖాళీ సిలిండర్లను వరుస క్రమంలో పెట్టి తమ వంతు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, గ్యాస్ దొరుకుతుందో లేదోనన్న ఆందోళనతో చాలామంది వినియోగదారులు రాత్రంతా గోదాం వద్దే నిద్రపోయి పహారా కాశారు. సరఫరా క్రమబద్ధీకరించి ఈ ఇబ్బందులను వెంటనే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

