కలం, వెబ్ డెస్క్ : “పులి పంజా విసరకపోయినా.. పలకరించినా ప్రమాదమే!” అన్న రేంజ్లో తనపై వస్తున్న విమర్శలకు కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఐపీఎల్ 2026లో సన్రైజర్స్పై టీమ్ ఓడిపోవడం, రహానే తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. అయితే, ఈ 37 ఏళ్ల వెటరన్ బ్యాటర్ ఏమాత్రం తగ్గకుండా విమర్శకుల నోళ్లు మూయించేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన స్ట్రైక్ రేట్ గురించి విమర్శలు చేస్తున్న వారిపై రహానే నిప్పులు చెరిగారు. “నేను సాధించిన సక్సెస్ చూసి కొందరు ఈర్ష్య పడుతున్నారు. వారికి నా ఆట చూడటం ఇష్టం లేదు. అందుకే ఏదో ఒక అజెండాతో నాపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు” అంటూ కుండబద్దలు కొట్టారు. 2023 నుండి తన స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉందని, గణాంకాలు తెలియని వారే తన గురించి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో తడబడిన మాట వాస్తవమే అని రహానే అంగీకరించారు. “ఒక్కోసారి బ్యాటర్కు లయ దొరకదు. కానీ నా ఉద్దేశం (Intent) మాత్రం క్లియర్గా ఉంది. పవర్ప్లేలో ఫిన్ అలెన్తో కలిసి నిర్భయంగా ఆడటమే నా ప్లాన్. విమర్శకులు ఏమనుకున్నా సరే.. నా శైలి మార్చుకోను. నన్ను నేను నమ్ముకుంటాను” అని ధీమా వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా పవర్ప్లేలో రహానే విధ్వంసం మామూలుగా లేదు. అభిషేక్ శర్మ తర్వాత అత్యధిక స్ట్రైక్ రేట్ (167.78) కలిగిన ఓపెనర్ రహానే కావడం విశేషం. అందుకే, బయట వినిపించే మాటలను చెత్తబుట్టలో వేసి, తదుపరి మ్యాచ్పై ఫోకస్ పెట్టానని కెప్టెన్ స్పష్టం చేశారు.

