కలం, వెబ్డెస్క్: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్లు వెల్లువెత్తుతున్న వేళ పార్లమెంట్లో కేంద్రం కీలక ప్రకటన చేసింది. నీట్ (NEET) పేపర్లీక్పై పార్లమెంట్లో చర్చకు సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు (Kiren Rijiju) ప్రకటించారు. ప్రతిపక్షాలు తమకు సహకరించాలని కోరారు. అయితే ముందు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేశారని, దీనికి సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కిరెన్ రిజిజు మాట్లాడుతూ.. సభ ప్రారంభమైన తొలి రోజు నుంచే ప్రభుత్వం నీట్ అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని, అయితే పార్లమెంటరీ నిబంధనల ప్రకారమే చర్చ జరగాలని చెప్పారు. చర్చ ఎంతసేపు జరగాలి, ఏ నిబంధన కింద నిర్వహించాలనే విషయాలను అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సంప్రదించి నిర్ణయిస్తామన్నారు. దేశ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందని రిజిజు పేర్కొన్నారు.
ఇక మరోవైపు ప్రతిపక్షం మాత్రం వాయిదా తీర్మానం కింద నీట్ పేపర్ లీక్పై చర్చ నిర్వహించడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. మూడు రోజులుగా వాయిదా తీర్మానం ఇస్తున్నా ప్రభుత్వం అంగీకరించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం చర్చకు సిద్ధమని చెబుతున్నా, ఏ నిబంధన కింద చర్చ నిర్వహిస్తారో స్పష్టం చేయడం లేదని ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్పై చర్చ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ అనే మూడు డిమాండ్లపై తమ ఆందోళన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

