కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో శనివారం సన్నాహక సమావేశం జరిగింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. సమావేశాలు సజావుగా జరిగేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని స్పీకర్ సూచించారు. సభ్యులు కోరిన సమాచారాన్ని త్వరగా అందించాలని, ప్రశ్నలకు సమాధానాలను ముందుగానే సిద్ధం చేయాలని కోరారు.
సభ్యులకు అందించే మెటీరియల్ను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ముందస్తుగా అందించాలని స్పీకర్ చెప్పారు. చర్చ జరిగే శాఖల అధికారులు సభా సమయంలో అందుబాటులో ఉండి.. మంత్రులు, సభ్యులకు అవసరమైన సమాచారం అందించాలని సూచించారు. ధర్నాలు, రాస్తారోకోలు జరగకుండా పోలీసులు మరింత అప్రమత్తంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఇంటెలిజెన్స్ సమాచారం వేగంగా అసెంబ్లీ అధికారులకు చేరేలా చూడాలని మండలి చైర్మన్ ఆదేశించారు. చైర్మన్, స్పీకర్ సూచనలను అధికారులు కచ్చితంగా అమలు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇదిలా ఉండగా, అసెంబ్లీ సెంట్రల్ హాల్ లో జరుగుతున్న పనులను సీఎం రేవంత్ రెడ్డి శనివారం పరిశీలించారు. సమావేశాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, వసతులు, పనుల పురోగతిని తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.

