కలం, వెబ్ డెస్క్: ఖానాపూర్ (Khanapur) మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసాబాసగా మారింది. తీవ్ర గందరగోళం నడుమ అధికారులు ఈ ఎన్నికను వాయిదా వేశారు. బీజేపీ అభ్యర్థి మౌనికకు ఏడుగురు సభ్యుల మద్దతు ఉందని.. ఆమెను చైర్మన్గా ప్రకటించాలంటూ ఆ పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సైతం తమ పార్టీకే మెజార్టీ సభ్యుల మద్దతు ఉందని చెబుతున్నారు.
మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాగానే అధికారులు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం తొలుత బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనిక పేరు పిలవగా, ఆమెకు మద్దతుగా ఏడుగురు కౌన్సిలర్లు చేతులు పైకి ఎత్తారు. అయితే అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నం సత్యం పేరు పిలవాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టు బీజేపీ సభ్యులు ఆరోపించారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. ఎమ్మెల్యే ఒత్తిడికి తలొగ్గుతున్నారని బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. గందరగోళం నడుమ అధికారులు ఎన్నికను వాయిదా వేశారు.
మరోవైపు బీజేపీ శ్రేణులు ఖానాపూర్ (Khanapur) మున్సిపాలిటీని ముట్టడించేందుకు యత్నించాయి. దీంతో తీవ్రమైన ఉద్రిక్తత చోటు చేసుకున్నది. మున్సిపల్ కార్యాలయం దగ్గర పోలీసుల, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులపై పోలీసుల లాఠీ చార్జ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మీడియాతో మాట్లాడుతూ.. తమకు ఏడుగురి మద్దతు ఉందని చెప్పారు.

