కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) పోలీసులు సినీ ఫక్కీలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆట కట్టించారు. వరంగల్లో చోరీలకు పాల్పడి రైల్లో పారిపోతున్న పశ్చిమ బెంగాల్కు చెందిన ముగ్గురు మోస్ట్ వాంటెడ్ దొంగలను మధిర సమీపంలో వెంబడించి పట్టుకున్నారు. పోలీసుల సమయస్ఫూర్తి, సాహసాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రత్యేకంగా అభినందించారు. హనుమకొండలోని కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల వరుస చోరీలు జరిగాయి. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా నిందితులు చోరీ సొత్తుతో ఖమ్మం మీదుగా వెళ్లే రైల్లో పారిపోతున్నట్లు సమాచారం అందింది. దీంతో వరంగల్ సీపీ ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ను అప్రమత్తం చేశారు. సీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిబ్బంది, అనుమానం రాకుండా ఖమ్మం రైల్వే స్టేషన్లో సాధారణ ప్రయాణికుల మాదిరి రైలు ఎక్కారు.
చుట్టుముట్టి.. చాకచక్యంగా బంధించి..
రైలులో ప్రతి బోగి, ప్రతి సీటును క్షుణ్ణంగా పరిశీలిస్తూ పోలీసులు ముందుకు సాగారు. మధిర స్టేషన్కు చేరుకునేసరికి ముగ్గురు నిందితులను గుర్తించి, చుట్టుముట్టి చాకచక్యంగా బంధించారు. ప్రాథమిక విచారణలో వారు బెంగాల్ కు చెందిన ఎస్కే. ఫిరోజ్, ఎస్కే.ఎమిన్, ఎస్కే. సుఖ్ చంద్గా గుర్తించారు. అనంతరం నిందితులను చోరీ సొత్తుతో సహా వరంగల్ పోలీసులకు అప్పగించారు. ఖమ్మం క్రైమ్ పోలీసుల సమన్వయం, తక్షణ స్పందనకు గుర్తింపుగా వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రశంసా పత్రాన్ని పంపారు. గురువారం ఖమ్మం సీపీ సునీల్ దత్ చేతుల మీదుగా వీటిని సిబ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, సీసీఎస్ ఏసీపీ తదితరులు పాల్గొన్నారు.

