కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ (KCR) ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. మనిషిలోని చెడు లక్షణాలు పరాభవం చెంది మంచితనం విజయం సాధించాలని కోరారు. రాష్ట్రం పునర్వైభవాన్ని సంతరించుకుని, ప్రగతి పథాన పయనించాలని ఆకాంక్షించారు. వ్యవసాయ పనులను నూతనంగా పునః ప్రారంభం చేసుకునే రైతు నామ సంవత్సరంగా ఉగాది పండుగ ప్రత్యేకతను సంతరించుకున్నదని పేర్కొన్నారు. ప్రకృతి మాత శిశిరాన్ని వీడి, కొత్త చిగురులతో వసంతాన్ని ఆహ్వానిస్తూ, నూతన ఆశలకు, సంకల్పాలకు నాంది పలుకుతుందని, ఉగాది నుండి కాలచక్రం పునరావృతమౌతుందని కేసీఆర్ తెలిపారు.
ద్వేష భావనలు, అహంకారం, తదితర చెడు లక్షణాలు పరాభవం చెంది వాటి స్థానంలో ఉన్నతమైన ఆశయాలు వృద్ధి చెంది, మనిషి సమున్నతమైన మార్గాన్ని అనుసరించాలనే తాత్వికతను శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది మనకు తెలియజేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, నష్టాలు సమస్యలు పరాభవం చెంది అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండి రాష్ట్రం పునర్వైభవం సాధించి విజయం వైపు సాగాలని కేసీఆర్ (KCR) ఆకాంక్షించారు.

