కలం, వెబ్ డెస్క్ : స్కూల్కు డుమ్మా కొట్టి ఫెన్సింగ్ మ్యాచ్లు చూసిన ఓ చిన్నారి.. ఇప్పుడు అదే క్రీడలో భారత స్టార్గా నిలిచింది. భారత ఫెన్సింగ్ స్టార్ భవానీ దేవి (Bhavani Devi) తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, ఆసియా సీనియర్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ సందర్భంగా ఆసక్తికర విషయాలు పంచుకుంది. 2006లో చెన్నైలో కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ జరిగినప్పుడు భవానీకి కేవలం 12 ఏళ్లు. అప్పట్లో అంతర్జాతీయ స్థాయి ఫెన్సర్ల ఆటను దగ్గర నుంచి చూడటానికి స్కూల్కు వెళ్లకుండా స్టేడియానికి వెళ్లేదని ఆమె తెలిపింది.
ఆ పోటీలు తనపై గొప్ప ప్రభావం చూపాయని, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే స్ఫూర్తిని ఇచ్చాయని చెప్పింది. ఈసారి భారత్ తొలిసారిగా ఆసియా సీనియర్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇవ్వడం తనకు ప్రత్యేక అనుభూతిని కలిగించిందని భవానీ పేర్కొంది. భారత అభిమానుల ముందు ఆడటం ఎంతో ఆనందంగా అనిపించిందని తెలిపింది. అయితే ఈ టోర్నీ భవానీకి మరో కారణంతో కూడా ప్రత్యేకం. గత ఏడాది నవంబర్లో ఇటలీలో భుజానికి సర్జరీ చేయించుకున్న తర్వాత ఆమె ఆడిన తొలి పెద్ద టోర్నీ ఇదే.
మహిళల సాబ్రే విభాగంలో 23వ స్థానంలో నిలిచిన భవానీ, ప్రీక్వార్టర్ దశకు చేరే పోరులో కొరియాకు చెందిన చోయ్ సె-బిన్ చేతిలో 14-15 తేడాతో ఓడిపోయింది. చివరి పాయింట్ వద్ద పరాజయం బాధ కలిగించినా, ఆ మ్యాచ్ నుంచి చాలా నేర్చుకున్నానని ఆమె తెలిపింది. ముఖ్యంగా సర్జరీ తర్వాత భుజం గురించి భయపడకుండా పూర్తిస్థాయిలో ఆడగలిగానన్న సంతృప్తి ఉందని చెప్పింది. దాదాపు రెండేళ్లుగా భుజం నొప్పితో ఇబ్బంది పడిన భవానీ, చివరకు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత కెరీర్లోనే అత్యంత సుదీర్ఘ విరామం తీసుకోవాల్సి వచ్చింది. సర్జరీ అనంతరం కొద్ది రోజులు చాలా కష్టంగా గడిచాయని, ఆస్పత్రిలో కూడా ఎక్కువ సమయం ఒంటరిగానే ఉన్నానని వెల్లడించింది. అయితే ఫెన్సింగ్కు మాత్రం దూరం కాలేదు. ప్రతిరోజూ తన శిక్షణ కేంద్రానికి వెళ్లి కోచ్తో వ్యూహాలు, సాంకేతిక అంశాలపై చర్చిస్తూ మానసికంగా తిరిగి పోటీలకు సిద్ధమయ్యానని తెలిపింది. భయం లేకుండా మళ్లీ బరిలోకి దిగేందుకు ఆ మానసిక సిద్ధత ఎంతో ఉపయోగపడిందని పేర్కొంది. ఇప్పుడు ఆమె దృష్టి వచ్చే నెల చైనాలోని హాంకాంగ్లో జరిగే వరల్డ్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్పై ఉంది.

