కలం, కరీంనగర్ బ్యూరో : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న హోం గార్డుల వార్షిక రొటేషన్ బదిలీల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, శాస్త్రీయంగా నిర్వహించనున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (CP Ghaush Alam) స్పష్టం చేశారు. గురువారం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని అస్త్ర హాలులో హోంగార్డులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బదిలీలకు సంబంధించిన అధికారిక మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, హోం గార్డుల బదిలీ ప్రక్రియలో పారదర్శకత, సమానత్వం, పరిపాలనా సామర్థ్యం, సిబ్బంది సముచిత పంపిణీని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ మార్గదర్శకాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్ విభాగాలు, కార్యాలయాలు, ఇతర విభాగాలలో పనిచేస్తున్న హోం గార్డులందరికీ వర్తిస్తాయని పేర్కొన్నారు.
మార్గదర్శకాలలోని ముఖ్య అంశాలు:
రొటేషన్ విధానం:
ఒకే యూనిట్లో ఏడాది పాటు సేవలు పూర్తి చేసుకున్న హోం గార్డులను పరిపాలనా అవసరాలకు అనుగుణంగా రొటేషన్ పద్ధతిలో బదిలీ చేయనున్నారు. గత సంవత్సరం బదిలీ కాని సిబ్బందికి ఈసారి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
ప్రత్యేక మినహాయింపులు:
వితంతు మహిళా హోం గార్డులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు, మానసిక వికలాంగ పిల్లలు కలిగిన వారు మరియు వచ్చే ఏడాది (30 జూన్ 2027) లోపు పదవీ విరమణ పొందనున్న హోం గార్డులకు నిబంధనల ప్రకారం బదిలీల నుండి మినహాయింపులు లేదా సడలింపులను పరిశీలిస్తారు.
వైద్య కమిటీ ఏర్పాటు:
వైద్య కారణాల ద్వారా మినహాయింపులు కోరుకునే వారి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఒక ప్రత్యేక వైద్య కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
లాటరీ విధానం:
అవసరమైన చోట్ల అదనపు సిబ్బంది ఎంపికను పూర్తి పారదర్శకంగా ఉంచేందుకు “డ్రా” (లాటరీ) విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ బదిలీల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూడాలని సమావేశానికి హాజరైన పోలీస్ అధికారులను సీపీ గౌష్ ఆలం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ రిజర్వ్ ఇన్స్పెక్టర్ రజినీకాంత్, కిరణ్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

