కలం, వెబ్ డెస్క్: తెలంగాణ శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత రాజీనామా (Kavitha Resignation) ను చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు కౌన్సిల్ కార్యదర్శి నర్సింహాచార్యులు గెజిట్ విడుదల చేశారు. తక్షణం ఆమె రాజీనామా అమలులోకి వచ్చింది. ఉభయ చట్టసభల శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన నిమిషాల వ్యవధిలోనే ఈ గెజిట్ విడుదల కావడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేయడంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబరు 3న రాజీనామా చేశారు. మండలి చైర్మన్కు రాజీనామా సమర్పించి నాలుగు నెలలు అవుతున్నా ఆమోదం పొందకపోవడాన్ని స్వయంగా ఆయననే కలిసి వివరించారు. రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందో స్వయంగా కౌన్సిల్ వేదికగా తానే వివరించనున్నానని, అందుకు అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. దానికి అనుగుణంగా జనవరి 5న ఆమెకు అవకాశం ఇచ్చారు. కారణాలను వివరిస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నారు.
పునరాలోచన తర్వాత కూడా.. :
ఆవేశంలో, భావోద్వేగంతో చేసిన రాజీనామాపై పునరాలోచించుకోవాలని చైర్మన్ సుఖేందర్రెడ్డి ఆమెకు సూచించారు. సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నానని, మళ్ళీ ఆలోచించాల్సిన పనిలేదని, ఆమోదించాలని చైర్మన్కు ఆమె విజ్ఞప్తి చేశారు. చివరకు శాసనమండలి నిరవధికంగా వాయిదా పడిన గంటల వ్యవధిలో ఆమె రాజీనామా (Kavitha Resignation) ను ఆమోదిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించడం, దానికి అనుగుణంగా కౌన్సిల్ కార్యదర్శి గెజిట్ జారీచేయడం గమనార్హం. బీఆర్ఎస్ తరఫున నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గాల తరఫున ఎమ్మెల్సీగా ఉన్న కవిత రాజీనామాతో ఆ స్థానం ఖాళీ అయింది. రానున్న ఆరు నెలల వ్యవధిలో ఉప ఎన్నిక జరగాల్సి ఉన్నది. గ్రామీణ స్థానిక సంస్థలు కొలువుదీరినా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనున్నది. 2022 జనవరి 5 నుంచి ఆమె ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. మరో రెండేండ్ల పదవీకాలం ఉన్నా ఆమె రాజీనామా చేశారు.
Read Also: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి మూడు సార్లు పీఎఫ్ విత్ డ్రా
Follow Us On : WhatsApp


