కలం, వెబ్ డెస్క్ : ‘బీఆర్ఎస్ నాయకులు నా మనసు విరిగేలా చేశారు. ప్రాణం పోయినా మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదు’ అని జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. జనం బాటలో భాగంగా ఆమె సోమవారం గద్వాల్ (Gadwal) లో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ (BRS) నాయకులే కుట్ర చేసి ఓడించినా ప్రజల మధ్యలోనే ఉన్నానని చెప్పారు. తాను వద్దని చెప్పినా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారన్నారు. నిజామాబాద్ లో తనను ఖైదీ చేశారని, గద్వాల్ కు కొత్తగా వచ్చినట్లు కవిత చెప్పారు.
అన్ని సంస్కృతులు కలిగిన ఇక్కడి భాష అంటే తనకు చాలా ఇష్టమని, సురవరం ప్రతాప్ రెడ్డి, గడియారం రామకృష్ణ శర్మ, బాగా పుల్లారెడ్డి లాంటి వాళ్లు ఈ ప్రాంతం వాళ్లేనని కవిత గుర్తు చేశారు. గద్వాల్, అలంపూర్లో రోడ్ల పరిస్థితి భయంకరంగా ఉందన్నారు. ఇక్కడున్న చాలా మంది పిల్లలు గంజాయికి బానిసగా మారారని చెబుతున్నారని..తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా ఈ విధంగా పరిస్థితి ఉంటుందా అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆలంపూర్ లో వంద పడకల హాస్పిటల్ ను నాసిరకంగా కట్టారని, ఆస్పత్రిలో ఎలాంటి సౌకర్యాలు లేవని కవిత(Kavitha) తెలిపారు. తుమ్మిళ్ల ప్రాజెక్ట్ లో ఆర్టీఎస్ కెపాసిటీని పూర్తిగా వాడుకోవాల్సి ఉందని కవిత చెప్పారు. వివాదం లేని ఆర్డీఎస్ నీళ్లను వాడుకోవటంపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని కోరారు. ప్రతి ప్రాంతంలో సీఎం బొమ్మ పెట్టుకొని టిప్పర్లతో ఇసుక దందా చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి ఈ దందాతో సంబంధం లేకపోతే వెంటనే దీనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అనుమతులిచ్చారని, రైతులను మోసం చేసి ఆ భూములను కొనుగోలు చేశారని ఆరోపించారు. నది రివర్ బెడ్ కు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీకి ఎలా పర్మిషన్ ఇస్తారు? అని కవిత ప్రశ్నించారు. అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఐజా కాటన్ సీడ్ విషయంలో పెద్ద మాఫియానే నడుస్తోందన్నారు. కర్నూల్ కోసం తీసుకువస్తున్న గుండ్రెవుల ఎత్తిపోతల పథకం కోసం ఇంచు భూమి కూడా తెలంగాణ నుంచి పోకుండా జాగృతి పోరాటం చేస్తుందని కవిత స్పష్టం చేశారు.
Read Also: రూ.365 కోట్లు స్కాలర్ షిప్ బకాయిలు విడుదల
Follow Us On: Pinterest


