కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు (Outsourcing Employees) న్యాయం చేయలేకపోయినందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ (Indira Park) వద్ద ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మహాధర్నాలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఏర్పడితే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థ ఉండదని కలలుగంటే రాష్ట్రం వచ్చాక అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపించాయని ఆమె తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల్లో మార్పు తేలేకపోయినందుకు క్షమాపణ కోరుతున్నానన్నారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను కూడా ఉన్నానని.. అందుకే “ఆ పాపంలో నాకు కూడా భాగస్వామ్యం ఉంది, నన్ను క్షమించండి” అని వ్యాఖ్యానించారు.
తమ సమస్యలను బీఆర్ఎస్ (BRS) పట్టించుకోకపోవడం వల్లే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు డిక్లేర్ చేసి మరీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక .. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని కవిత (Kavitha) ఆరోపించారు. రెండున్నరేళ్లుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పోరాటం చేస్తుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మిలియన్ మార్చ్ తరహాలో హైదరాబాద్ వీధుల్లో మార్చ్ చేసేందుకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రణాళిక చేయాలని.. అలా చేస్తేనే ప్రభుత్వం దిగి వచ్చి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తుందని సూచించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జాగృతి (Telangana Jagruthi) తోడుగా ఉంటుందన్నారు. రెండు రోజుల్లో అన్ని శాఖల్లో దళారులు, మధ్యవర్తులు లేకుండా నేరుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేలా కార్పొరేషన్ , జీవోలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. లేదంటే జాగృతి అధికారంలోకి వస్తే పర్మినెంట్ గా కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తామని స్పష్టం చేశారు.
Read Also: డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన విజయ్..!
Follow Us On : WhatsApp

