కలం, వెబ్ డెస్క్: సింగరేణి (Singareni) అధికారులు పీఆర్పీ కోసం ధర్నా చేస్తే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వారి దగ్గర లంచాలు అడిగారంటూ టీఆర్ఎస్ చీఫ్ కవిత (Kavitha) సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ బాయిబాట కార్యక్రమంలో భాగంగా కవిత శనివారం భూపాలపల్లిలో సింగరేణి కార్మికుల సమస్యలపై ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సింగరేణిలో ఏ మైన్కు వెళ్లినా సమస్యలే కనిపిస్తున్నాయని కవిత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అడుగడుగునా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడం వల్ల సింగరేణి సంస్థ నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. సింగరేణి సంస్థ కార్మికులకు పని ముట్లు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందన్నారు. యాజమాన్యం కూడా కార్మికుల విషయంలో తప్పిదాలు చేస్తోందన్నారు.
కార్మికుల హక్కుగా ఉన్న డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. డిపెండెంట్ ఎంప్లాయిమెంట్, పెండింగ్ ఉన్న 1200 మందికి ఇవ్వడం లేదన్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి నెల రోజుల్లో స్పష్టమైన ఆర్డర్ రావాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల రెండు సార్లు మెడికల్ బోర్డు పెడతామని హామీ ఇవ్వాలన్నారు. లేదంటే నిరాహార దీక్షకు కూర్చుంటామని కవిత హెచ్చరించారు. కార్మికుల హక్కులు సాధించడానికి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కవిత స్పష్టం చేశారు. సింగరేణిలో ఎలక్టెడ్ యూనియన్ లేదనే యాజమాన్యం కనీసం తాగునీరు, ఆక్సీజన్ కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్మికుల హక్కుల సాధనే లక్ష్యంగా హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ మందుకు వచ్చాయన్నారు. అధికారుల హక్కుల కోసం కూడా తాము గళం విప్పుతామని కవిత తెలిపారు. అలాగే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కార్మికుల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు.

