కలం, స్పోర్ట్స్ బ్యూరో: మహమ్మద్ షమీ (Mohammed Shami)కి బీసీసీఐ (BCCI) డోర్స్ పూర్తిగా క్లోజ్ చేసేసిందా? ప్రస్తుతం భారత క్రికెట్లో జరుగుతున్న చర్చ ఇదే. ఇటీవల టీమిండియా స్క్వాడ్లో జరిగిన పరిణామాలు కూడా ఇదే సంకేతాన్ని ఇచ్చాయి. శ్రీలంకతో టెస్ట్ సిరీస్కు భారత్ సిద్ధమవుతున్న సమయంలో బుమ్రా మోకాలికి గాయమైంది. దీంతో భారత టెస్టు జట్టులోకి మహ్మద్ షమీ తిరిగి వస్తాడని చాలామంది భావించారు. కానీ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. బుమ్రా స్థానంలో అనుభవజ్ఞుడైన షమీని కాకుండా.. జమ్మూకాశ్మీర్ యువ పేసర్ అకీబ్ నబీకి అవకాశం కల్పించింది.
భారత క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో జస్ప్రీత్ బుమ్రా ప్రధాన పేసర్. మ్యాచ్ను ఒక్క స్పెల్తో మలుపుతిప్పే సామర్థ్యం అతని సొంతం. కానీ అదే సమయంలో బుమ్రా ఫిట్నెస్ సమస్యలు మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారాయి. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో బుమ్రా మోకాలికి గాయమైంది. అది పూర్తిగా తగ్గకపోవడంతో శ్రీలంకతో జరిగే రెండు టెస్టులకు అతను దూరమయ్యాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందిన తర్వాత కూడా తుది ఫిట్నెస్ పరీక్షలో క్లియరెన్స్ పొందలేకపోయాడు. దీంతో సెలెక్టర్లు ప్రత్యామ్నాయంగా అకీబ్ నబీని ఎంపిక చేశారు.
గాయాలతో జట్టుకు దూరం
టెస్ట్ సిరీస్కు బుమ్రా దూరమైన వెంటనే అందరి మదిలో మెదిలిన పేరు మహ్మద్ షమీదే. ఎందుకంటే విదేశాల్లోనూ, స్వదేశంలోనూ భారత్కు ఎన్నో విజయాలు అందించిన అనుభవం అతని సొంతం. టెస్టుల్లో కొత్త బంతితోనూ, పాత బంతితో రివర్స్ స్వింగ్తోనూ ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగల బౌలర్గా షమీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే సెలెక్టర్లు మాత్రం అతని వైపు చూడలేదు. యువ పేసర్ అకీబ్ నబీకి తొలిసారి పిలుపునిచ్చారు. అదే ఇప్పుడు షమీ భవిష్యత్తుపై సందేహాలు పెంచుతున్నది.
అతను ఇప్పటికే మూడేళ్లుగా టెస్టులకు దూరంగా ఉన్నాడు. చివరిసారి 2023లో టెస్టు మ్యాచ్ ఆడాడు. వన్డేల్లో గతేడాది న్యూజిలాండ్తో, టీ20ల్లో 2025లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్ అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్గా నిలిచింది. మొదట్లో గాయాల కారణంగా షమీ జట్టుకు దూరమయ్యాడు. అయితే కోలుకున్న తర్వాత దేశవాళీ క్రికెట్లో వరుసగా ఆడుతున్నప్పటికీ, జాతీయ జట్టులోకి మాత్రం పిలుపు రావడం లేదు. దీంతో అతని పునరాగమనం ప్రశ్నార్థకంగా మారింది.
సెలెక్టర్ల క్లియర్ మెసేజ్
షమీ తిరిగి టెస్టు జట్టులోకి వస్తాడా? అనే ప్రశ్నకు ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం టెస్టు క్రికెట్ ఆడేందుకు అవసరమైన స్థాయి ఫిట్నెస్ షమీకి లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్య తర్వాత బుమ్రా గాయపడినా షమీకి అవకాశం రాకపోవడం యాదృచ్ఛికం కాదనే అభిప్రాయం బలపడింది. నబీ ఎంపికతో సెలెక్టర్లు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పినట్లు కనిపిస్తోంది. భారత టెస్టు జట్టులోకి రావాలంటే గత విజయాలు, అనుభవం మాత్రమే సరిపోవు. పూర్తి ఫిట్నెస్తో పాటు దేశవాళీ క్రికెట్లో నిలకడగా అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిందే. అంతేకాదు.. యువ పేసర్లు ఇప్పుడు కేవలం జట్టులో స్థానం కోసం వేచి ఉండడం లేదు. దేశవాళీ క్రికెట్లో భారీగా వికెట్లు తీస్తూ నేరుగా తుది జట్టులో చోటు కోసం పోటీ పడుతున్నారు. అలాంటి పరిస్థితిలో సీనియర్ ఆటగాళ్లకు పునరాగమనం మరింత కఠినంగా మారుతోంది.
షమీకి అదే సవాల్
బుమ్రా గాయం కారణంగా ఖాళీ అయిన చోటు కూడా షమీకి దక్కలేదు. దీంతో అతను రానున్న రోజుల్లో తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. దేశవాళీ టోర్నీల్లో, ముఖ్యంగా దులీప్ ట్రోఫీ వంటి పోటీల్లో యువ పేసర్లను మించి రాణించాల్సి ఉంటుంది. అదే సమయంలో పూర్తి ఫిట్నెస్ను కూడా నిరూపించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే భారత టెస్టు జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
ఎవరి పెర్ఫామెన్స్ ఎంత?
= ఫిట్నెస్పై సందేహాలు ఉన్నా దేశవాళీ క్రికెట్లో షమీ ప్రదర్శన మాత్రం బలంగానే ఉంది. గత ఏడు రంజీ ట్రోఫీ మ్యాచ్ల్లో అతను 37 వికెట్లు తీశాడు. 50 మెయిడెన్ ఓవర్లు వేశాడు. మూడుసార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు ఫస్ట్క్లాస్ క్రికెట్లో తన కెరీర్ బెస్ట్ గణాంకాలైన 8 వికెట్లకు 90 పరుగులు కూడా నమోదు చేశాడు. ఈ గణాంకాలు చూస్తే షమీ ఇంకా ప్రభావం చూపగల బౌలరేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
= షమీ గణాంకాలు ఎంత బాగున్నా.. అకీబ్ నబీ ప్రదర్శన వాటికంటే మెరుగ్గా నిలిచింది. గత రంజీ ట్రోఫీ సీజన్లో నబీ ఏకంగా 60 వికెట్లు పడగొట్టాడు. నిలకడైన ప్రదర్శనతో దేశవాళీ క్రికెట్లో అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ ప్రదర్శనకే బహుమతిగా భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.

