కలం, వెబ్ డెస్క్: కేంద్రంలోని మోడీ సర్కార్ ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు కుట్ర చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదల మీద కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతూ మంగళవారం వీడియో సందేశం విడుదల చేశారు. ఉపాధి హామీ పథకానికి (MGNREGA) సంబంధించి పని దినాలు తగ్గించటం, నిధులు ఇవ్వకపోవటంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేదలకు మేలు చేసే ఉద్దేశంతో తెచ్చుకున్న ఉపాధి హామీ పథకాన్ని తొలగించే కుట్ర చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి చట్టబద్దత లేకుండా చేశారని ఆగ్రహించారు.
చట్టబద్ధత ఉంటే నిధులు ఇవ్వడం తప్పనిసరి అవుతుందని.. అందుకే ఈ పథకాన్ని ఒక ప్రొగ్రామ్ గా మార్చేసి నిధులు ఇవ్వకుండా పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ పథకం వచ్చిన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంతో కొంత మెరుగుపడిందని కవిత చెప్పారు. తెలంగాణలో కరోనా తర్వాత 2021-22లో 14 కోట్ల పని దినాలు ఉంటే.. గతేడాది 7 కోట్లకు పని దినాలను తగ్గించారని మండిపడ్డారు. ఈ స్కీంలో పని దినాలు కల్పించే ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారని.. వారికి ఉద్యోగ భద్రతతో, కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే, వారు ప్రజల కోసం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

