కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) పట్టణంలోని సుభాష్ నగర్ ఏరియాలో జూద స్థావరంపై కరీంనగర్ రూరల్ స్టేషన్ ( III టౌన్) పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 17 మంది నిందితులను అదుపులోకి తీసుకొని.. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ బి.చెరాలుకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు.. సుభాష్ నగర్లోని సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో కొందరు వ్యక్తులు జూదం (మూడు ముక్కల ఆట) ఆడుతున్నట్లు తెలిసింది. దీంతో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనుమతితో సోమవారం రాత్రి పోలీసులు సదరు నివాసాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేపట్టారు.
ఈ దాడిలో కరీంనగర్, హన్మకొండ, సిరిసిల్ల, సిద్ధిపేట ప్రాంతాలకు చెందిన 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ప్రధాన నిర్వాహకుడు (A1) సిరిపురం నాగభూషణం జూదం గృహాన్ని నడుపుతున్నట్లు విచారణలో తేలింది. ఆయనతో పాటు సిరిపురం నాగభూషణం (కరీంనగర్), చింతల రవీందర్ (కరీంనగర్), బండ రత్నాకర్ రెడ్డి (హన్మకొండ), గోదాల రాజిరెడ్డి (హన్మకొండ), జంగ దేవేందర్ రెడ్డి (కరీంనగర్), ఇతర 12 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.6,74,280 నగదు, 16 మొబైల్ ఫోన్లు, 2 కార్లు, 2 బైకులు, 104 ప్లేయింగ్ కార్డులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పట్టుబడిన నిందితులను స్టేషన్కు తరలించిన ఇన్ స్పెక్టర్ G.తిరుమల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

