కలం, కరీంనగర్ బ్యూరో : ఇతర రాష్ట్రాల నుండి వచ్చి నివసిస్తూ వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాల నమోదు ప్రక్రియను కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రారంభించినట్లు ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ తెలిపారు. కరీంనగర్ (Karimnagar) పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయడానికి సీపీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. నేపాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల నుండి వచ్చి స్థానికంగా నివసిస్తున్న కార్మికుల వ్యక్తిగత వివరాలు, నివాస చిరునామాలు, ఉపాధి వివరాలను సేకరించి ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా కొత్తపల్లి స్టేషన్ హౌస్ అధికారి ట్రైనీ ఐపీఎస్ సోహం సునిల్ మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన కోసం వలస కార్మికుల వివరాల నమోదు ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని కార్మికులకు అవగాహన కల్పిస్తూ వారి వివరాలను నమోదు చేశారు.

