కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) ప్రజలకు వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని, దీని కోసం ఇంజనీరింగ్ అధికారులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) సూచించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ మంచి నీటి సరఫరా లో భాగంగా సోమవారం మానేరు డ్యాం సమీపంలో గల నీటి శుద్దీకరణ కేంద్రంను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మేయర్ సందర్శించారు. క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి నీటి శుద్దీకరణ కీలక విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నీటి శుద్దీకరణ కేంద్రంలో 34, 14 ఎంఎల్ డీ నీటి సంపులు, ఫిల్టరేషన్ బెడ్లు, మోటారు పంపులను తనిఖీ చేసి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న ల్యాబ్ ను సందర్శించి నీటి పరీక్షలను పరిశీలించి, నీటి నాణ్యతను తనిఖీ చేశారు. నీటి నాణ్యత పరీక్షల రికార్డును తనిఖీ చేసి.. ల్యాబ్ సిబ్బంది కి ఆదేశాలు జారీ చేశారు. నీటి పరీక్షల అనంతరమే… సరఫరా చేయాలని సూచించారు. క్లోరినేషన్, ఇతర శుద్దీకరణ ప్రక్రియలు నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా లేదా అని అధికారులను ఆరా తీశారు.
బూస్టర్ పంపులు, ఇన్టెక్ వెల్ తనిఖీ..
బూస్టర్ పంపులను, ఇన్టెక్ వెల్ ను తనిఖీ చేసి పరిశీలించారు. మానేరు డ్యాం ప్రస్తుత నీటి సామర్థ్యంను అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వ పథకం ‘అమృత్’ కింద నగరంలో నూతనంగా నిర్మిస్తున్న వాటర్ సంపులు, రిజర్వాయర్ పనులను పరిశీలించారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. నగరంలో ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటూ.. పైపులైన్ల లీకేజీలను వెంటనే అరికట్టాలన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. లో-ప్రెషర్ ఉన్న ప్రాంతాలను గుర్తించి.. ప్రెషర్ సరిగా వచ్చేలా చూడాలని మేయర్ సూచించారు. ఫిల్టర్ బెడ్ల పరిశుభ్రత క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. అత్యవసర మరమ్మతుల కోసం ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలన్నారు.
మానేరు డ్యాం నీటి మట్టం పాటించేలా… ఇరిగేషన్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మానేరు డ్యాం లో సరైన నీటి సామర్థ్యం పాటించేలా ఇరిగేషన్ శాఖకు లేక రాశామని కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas). తాగు నీటి సరఫరా విషయంలో నగర ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. వేసవికాలం దృష్ట్యా సమ్మర్ ఆక్షన్ ప్రణాళిక ప్రకారం సమయానికి అనుగుణంగా మంచి నీటి సరఫరా చేస్తామని తెలిపారు. అమృత్ 2 పథకంలో చేపట్టిన పనులు త్వరలోనే పూర్తి చేసి.. విలీన గ్రామాల డివిజన్లకు నగరంతో సమానంగా నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నీటి సరఫరా సమయంలో అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వసంత లక్ష్మి భూమయ్య, మాసం గణేష్, ఎస్ఈ రాజ్ కుమార్, డీఈ దేవేందర, ఏఈ బీంవర్థన్ రెడ్డి, ఫిల్టర్ బెడ్ ఇంచార్జ్ అజయ్, తదితరులు పాల్గొన్నారు.
Read Also: నాడు సురేఖ.. నేడు సీతక్క.. కోర్టుకెక్కిన వివాదాలు
Follow Us On: X(Twitter)

