కలం, కరీంనగర్ బ్యూరో : ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించినప్పుడే వైద్యులకు మంచి గుర్తింపు లభిస్తుందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Collector Chitra Mishra) అన్నారు. గురువారం చిగురుమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించి సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా పేషంట్లతో మాట్లాడిన కలెక్టర్, వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా, సేవలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో సమావేశమై ప్రజలు మెచ్చే విధంగా సేవలు అందించాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే వైద్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె అన్నారు. పేషంట్లకు సమయానికి చికిత్స అందించడంతో పాటు సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఫార్మసీ, ఓపీ గది తదితర విభాగాలను పరిశీలించిన కలెక్టర్, మందుల లభ్యతపై కూడా ఆరా తీశారు. అనంతరం సమీపంలోని పల్లె దవాఖానను సందర్శించి అక్కడి వైద్య సేవలను కూడా పరిశీలించారు. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలు ఎక్కువగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ జగదీశ్వర్, తహసీల్దార్ రమేష్, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

