కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా (Bhavesh Mishra) అధికారిక బాధ్యతలతో పాటు విద్యారంగంపై తన ప్రత్యేక శ్రద్ధను మరోసారి చాటిచెప్పారు. గురువారం జిల్లా కేంద్రంలోని విజయ హైస్కూల్లో నిర్వహిస్తున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించిన ఆయన, పరిశీలనకే పరిమితం కాకుండా స్వయంగా బోధన చేపట్టి ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేశారు. స్మార్ట్ బోర్డు సహాయంతో పాఠ్యాంశాలను ప్రభావవంతంగా బోధించే విధానాలను వివరించిన కలెక్టర్, విద్యార్థుల్లో అవగాహన పెంపొందించే బోధనా పద్ధతులపై సూచనలు చేశారు.
క్లిష్టమైన అంశాలను సరళంగా వివరించడం, విద్యార్థులను ఆలోచింపజేసే ప్రశ్నలు అడగడం, ప్రతి విద్యార్థి తరగతి గదిలో భాగస్వామ్యం అయ్యేలా బోధన సాగించాలని సూచించారు. శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్, బోధనలో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. ఉపాధ్యాయులు అడిగిన సందేహాలకు సమాధానాలు ఇస్తూ, నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్నతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

