కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నరపాలక సంస్థ పరిధిలో జన గణన (Census Survey) ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగుతుందని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ (Praful Desai) అన్నారు. 2027 జన గణనలో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్ల వారిగా ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ గృహాల జాబితా నమోదు చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు. నగరంలోని ప్రతి డివిజన్ను ఇప్పటికే నిర్దిష్టమైన హౌజ్ లిస్టింగ్ బ్లాకులుగా విభజించి, సర్వేను క్రమబద్ధీకరించారు. ప్రతి బ్లాక్కు ఒక ఎన్యూమరేటర్ను కేటాయించి, ఆ పరిధిలోని ప్రతి నివాసాన్ని సర్వే చేసేలా చర్యలు చేపట్టారు. నగర వ్యాప్తంగా దాదాపు 666 ఎన్యూమరేషన్ బ్లాకులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 666 ఎన్యూమరేటర్లు, 111 మంది సూపర్ వైజర్లతో పాటు నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది కూడా జనాభా సర్వేలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
ఈ సందర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ (Praful Desai) మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన 2027 జనాభా లెక్కింపుకు నగర ప్రజలు స్వచ్చందంగా సహాకరించాలని పిలుపు నిచ్చారు. సర్వేలో భాగంగా ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు ఇంటింటికి తిరుగుతూ ఇంటి యజమాని వివరాలు, కుటుంబ సభ్యుల సంఖ్యను నమోదు చేస్తారని తెలిపారు. సర్వే సమయంలో డివిజన్ల వారిగా ఇంటింటికి వచ్చిన ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లకు ప్రజలు సహకరించి మీ ఖచ్చితమైన వివరాలను అందించాలని కోరారు.
జన గణనలో (Census Survey) ప్రస్తుతం ప్రతి ఇంటి తలుపుపై లేదా గోడపై విశిష్ట గుర్తింపు సంఖ్యను (House Numbering) చాక్పీస్ లేదా స్టిక్కర్ల ద్వారా వేస్తారని పేర్కొన్నారు. హౌజ్ లిస్టు బ్లాక్ సర్వే కొనసాగుతుందని, ప్రజలు దానికి సహాకరించాలని కోరారు. ఎన్యూమరేటర్లు సేకరిస్తున్న డేటాను సరిచూస్తూ, ఎక్కడా పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో స్వయంగా క్షేత్రస్థాయిలో సర్వే తీరును పరిశీలిస్తూ సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలిపారు. నగర అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఈ సర్వే చాలా ముఖ్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులు వేణు, శ్రీధర్, తేజస్విని, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
Read Also: నీట్ అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. త్వరలోనే పునః పరీక్ష తేదీ ప్రకటన
Follow Us On : WhatsApp

