కలం, వెబ్ డెస్క్ : కాన్పూర్ (Kanpur)లో బీఈడీ ప్రవేశ పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురైంది. పరీక్షా కేంద్రం వెలుపల ఒక అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది. కర్నల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరీక్ష రాయడానికి వచ్చిన 20 మందికి పైగా అభ్యర్థులు ఒక జిరాక్స్ దుకాణం వెలుపల నిలబడ్డారు. అక్కడ గుర్తు తెలియని వాహనం ఢీ కొని డ్రైనేజీపై ఉన్న సిమెంట్ స్లాబ్ ఒక్కసారిగా విరిగిపోయింది.
దీంతో అక్కడ నిల్చున్న అభ్యర్థులు అకస్మాత్తుగా డ్రైనేజీ గుంతలో పడిపోయారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అభ్యర్థులను పైకి లాగారు. ఈ దుర్ఘటనలో పలువురు అభ్యర్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.

