కలం, నల్లగొండ : గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్య సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) తెలిపారు. కనగల్ మండల కేంద్రంలో రూ.6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులను ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో సందర్శించి, పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నాణ్యతతో పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. కళాశాల భవన నిర్మాణ పనులను ఎక్కడా రాజీ పడకుండా, పూర్తి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా భవనాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యా వసతులు కల్పించాలనేదే ప్రభుత్వ సంకల్పం అన్నారు. అందులో భాగంగానే విద్యా రంగానికి, మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది అని అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

