కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ నగరంలో జరుగుతున్న పాంచజన్యం సభలో తెలంగాణ రక్షణ సేన కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ అర్వింద్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా వెళ్లడానికి రెడీగా ఉన్నారని వివరించారు. ఈ మధ్యనే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ను కూడా కలిసొచ్చారని వివరించారు.
మునిగిపోయే కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఎంపీ అర్వింద్ భావిస్తున్నారని కవిత ఎద్దేవా చేశారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి ఎంపీగా అర్వింద్ ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదని మండిపడ్డారు. మాధవ్ నగర్ వంతెన ఇంకా పూర్తి చేయకుండా గాడిదల పళ్లు తోముతున్నరా.. అంటూ సెటైర్లు వేశారు. ధర్మపురి అర్వింద్ పేరులోనే ధర్మం ఉందని, మనిషి మొత్తం అధర్మమే అన్నారు.
ప్రయోజనం లేని పసుపు బోర్డు..
నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డ్ తెచ్చానని అర్వింద్ గొప్పలు చెప్పుకుంటున్నారని కవిత విమర్శించారు. పసుపు ధరలు పడిపోతే.. రైతులకు మద్దతు ధర ఇవ్వడానికి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇటీవల జిల్లా పర్యటనకు గవర్నర్ వచ్చినప్పుడు కూడా కొందరు పసుపు రైతులు గవర్నర్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారని వివరించారు. అప్పుడు పక్కనే ఉన్న అర్వింద్.. పసుపు రైతుల సమస్యలను తాను చూసుకుంటానని నమ్మబలికారని విమర్శించారు.

