Mobile Popup Ad
Mobile Popup Ad

హనుమకొండలో పర్యావరణ పరిరక్షణకు వినూత్న కార్యక్రమం

కలం, హనుమకొండ : హనుమకొండలో(Hanumakonda) అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అవినీతి వ్యతిరేక సంస్థ జ్వాల ఆర్గనైజషన్ (Jwala NGO) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. “ప్లాస్టిక్‌కు శవయాత్ర – ప్రకృతికి జీవయాత్ర” పేరుతో భారీ ర్యాలీ నిర్వహించి ప్లాస్టిక్ అనర్థాలపై ప్రజలలో అవగాహన కల్పించింది. ఈ ర్యాలీ 1000 స్తంభాల గుడి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ప్లాస్టిక్ వ్యర్థాలతో రూపొందించిన శవయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జ్వాల సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ మాట్లాడుతూ, రోజురోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగం వల్ల గాలి, నీరు, భూమి తీవ్రంగా కాలుష్యానికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ కారణంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు పెరుగుతున్నాయని ఆయన హెచ్చరించారు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరిస్తున్నప్పటికీ, వాటిని సమర్థవంతంగా రీసైక్లింగ్ చేయడంలో లోపాలు ఉన్నాయని  విమర్శించారు.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై చిన్న వ్యాపారులపై చర్యలు తీసుకుంటున్న అధికారులు, పెద్ద పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలులో ప్రభుత్వం విఫలమవుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ శాఖల నుంచే ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని, ప్రజలలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ కళాశాల ఎన్‌సీసీ ఆఫీసర్ సదానందం, జ్వాల సంస్థ సభ్యులు అచ్చే అమర్నాథ్, బుర్రి కృష్ణమూర్తి, ప్రకాష్, గుండపు సాయిచంద్, రవీందర్, కత్తుల రాజు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>