కలం, సెంట్రల్ డెస్క్: నేరం రుజువు కాలేదు.. శిక్ష ఖరారు కాలేదు.. కానీ, నాలుగు గోడల మధ్య వారి యవ్వనం కరిగిపోతున్నది. కండ్ల ముందే జీవితం శిథిలమవుతున్నా చూస్తూ ఉండిపోవడం తప్ప వారు చేయగలిగేదేమీ లేదు. బెయిల్ పిటిషన్ వేయాలన్న అవగాహన లేక కొందరు.. అవగాహన ఉన్నా చేతిలో డబ్బులు లేక ఇంకొందరు.. అండర్ ట్రయల్ ఖైదీల (Undertrial Prisoners) పేరుతో జైళ్లలోనే ఏండ్లకేండ్లు మగ్గిపోతున్నారు. కన్నవాళ్లను, కట్టుకున్నవాళ్లను, కడుపున పుట్టినవాళ్లను చూడలేక, కనీసం తమ గోడును వినే నాథుడు లేక.. ఆ చీకటి గదుల్లోనే ఎందరో అభాగ్యుల ఆశలు ఆవిరైపోతున్నాయి. శిక్షా కాలం కన్నా రెండింతలు ఎక్కువే విచారణ ఖైదీలుగా జీవితాన్ని గడుపుతున్నవాళ్లు కోకొల్లలు.
దేశంలో 5.10 లక్షల మంది ఖైదీలు ఉంటే.. 3.80 లక్షల మంది (75 శాతం) అండర్ ట్రయల్ ఖైదీలే. వీరిలో చాలా మంది విచారణ పేరిట మూడు నాలుగేండ్ల నుంచి జైలు జీవితం గడుపుతున్నవాళ్లే. కొందరైతే ముప్పై, నలభై ఏండ్లు అండర్ ట్రయల్ ఖైదీలుగా ‘రుజువుకాని నేరానికి శిక్ష’ను అనుభవించి బయటకు వచ్చినవాళ్లూ ఉన్నారు. తెలంగాణ జైళ్లలో 42,566 మంది ఖైదీలు ఉంటే.. వీరిలో 36,627 మంది అండర్ ట్రయల్ ఖైదీలే. విచారణలో తీవ్ర జాప్యం, కోర్టుల్లో న్యాయ సిబ్బంది కొరత, కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్న కేసులు.. ఇలా ఎన్నో కారణాలు ఎంతో మందిని అండర్ ట్రయల్ ఖైదీలుగా జైళ్లలో ఏండ్ల తరబడి బతుకీడ్చేలా చేస్తున్నాయి. పేద ఖైదీల కోసం ఉచిత న్యాయ సలహా ఉన్నా.. అది పేరుకే పరిమితమవుతున్నది. ఏటా రిపబ్లిక్ డే, పంద్రాగస్టు, గాంధీ జయంతి, అంబేద్కర్ జయంతి వంటి అకేషన్స్లో ప్రభుత్వాలు సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తుంటాయి. కానీ.. ఏండ్లకేండ్లు అండర్ ట్రయల్ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్న వారికి మాత్రం ఎలాంటి రిలీఫ్ దొరకడం లేదు. వీటిపై ‘కలం 360 డిగ్రీస్‘ ప్రత్యేక కథనం చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: నో కాంప్రమైజ్.. ఇదే జెన్ జీ ఫార్ములా!!
Follow Us On : WhatsApp

