కలం, వెబ్ డెస్క్: దేశంలో ఎరువుల లభ్యతపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా (JP Nadda) లోక్సభలో కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం దేశంలో ఎరువుల కొరత లేదని, రైతులు ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ఎరువుల సరఫరాపై పడకుండా, రైతుల అవసరాలకు తగినట్లుగా ఎరువులను అందిస్తామని హామీ ఇచ్చారు. ఎరువుల (Fertilizer) తయారీకి అవసరమైన ముడిసరకుల దిగుమతిలో ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోందని ఆయన వెల్లడించారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా సకాలంలో ఎరువుల పంపిణీ జరిగేలా కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని నడ్డా భరోసా ఇచ్చారు.

