కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఏ పల్లెలో చూసినా రేవంత్ రెడ్డి (Revanth Reddy) పోవాలి.. కేసీఆర్ (KCR) రావాలనే నినాదం వినిపిస్తోందని బీఆర్ఎస్ పార్టీలో చేరిన జీవన్ రెడ్డి (Jeevan Reddy) అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి కేసీఆర్ నాయకత్వం కావాల్సిందేనన్నారు. ఆయన జగిత్యాలకు వస్తున్నారంటే.. ఎక్కడ చూసినా జనాలే గుమిగూడి ఎదురు చూస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. తనకు కేసీఆర్ తో ఎన్నో దశాబ్ధాలుగా అనుబంధం ఉందన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్.. కేంద్ర మంత్రి పదవిని సైతం వదులుకున్నారని గుర్తు చేశారు. అప్పట్లో కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తే.. ఆయనపై కాంగ్రెస్ పార్టీ తనను బలవంతంగా నిలబెట్టిందన్నారు. కేసీఆర్ లాంటి వ్యక్తిని ఢీకొనే సామర్థ్యం ఎవరికైనా ఉంటుందా.. అని ప్రశ్నించారు.
‘రేవంత్ నా ఉసురు తీసుకున్నాడు’
సీఎం రేవంత్ రెడ్డి గత 20 నెలలుగా నా ఉసురు తీసుకున్నాడని జీవన్ రెడ్డి (Jeevan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవిత చరమాంక దశలో తనకు ఎందుకు ఈ గోస.. అని ఆవేదన చెందారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే.. చివరికి నాకు మిగిలిందేంటి.. ఆవేదన, మానసిక వేదన తప్ప అని ప్రశ్నించారు. తన రాజకీయ జీవితంలో పదవుల కోసం ఎన్నడూ పాకులాడలేదని గుర్తు చేశారు. తెలంగాణకు పట్టిన కాంగ్రెస్, రేవంత్ పీడను వదిలించుకోవాలంటే.. కేసీఆర్ తోనే సాధ్యమని.. ఆయన మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ప్రతి పల్లెలో గులాబీ జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ ఘోరంగా తయారవుతుందని జోస్యం చెప్పారు.
Read Also: ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన జీవన్ రెడ్డి : సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Sharechat

