కలం, జనగామ : జనగామ (Jangaon) జిల్లా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ‘ఇందిరా మహిళా శక్తి’ స్టాల్స్ (వనిత టీ స్టాల్, విజయ డెయిరీ పార్లర్) తొలగించడాన్ని నిరసిస్తూ బాధిత మహిళలు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఆశ్రయించారు. గత కలెక్టర్ రిజ్వాన్ బాషా చొరవతో డ్వాక్రా మహిళల ఉపాధి కోసం ఈ స్టాల్స్ ఏర్పాటు చేయగా, ప్రస్తుత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వీటిని తొలగించేందుకు ప్రయత్నించడంపై మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన మహిళలు తమ జీవనాధారాన్ని కాపాడాలని కోరారు. దీనిపై స్పందించిన ఎంపీ.. వెంటనే కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బూడిద గోపి, డివైఎఫ్ఐ కార్యదర్శి ధర్మ భిక్షం తదితరులు పాల్గొన్నారు.

