కలం, జనగామ : జనగామ (Jangaon) జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు, ఇప్పటికే కాంటా చేసిన బస్తాలను వెంటనే తరలించాలని రైతులు అధికారులను వేడుకున్నారు. మార్కెట్లో తడిసిన ధాన్యం పదిహెను వేలకు పైగా బస్తాలు ఉండగా, వాటిని తరలించేందుకు కనీసం 15కు పైగా లారీల అవసరం ఉందని రైతులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మార్కెట్ను పరిశీలించేందుకు వచ్చిన ఆర్డీవోను తన వాహనం ను రైతులు అడ్డుకున్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆర్డీవో తన వాహనాన్ని అక్కడే వదిలి ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి వెళ్లినట్లు సమాచారం.
ఈ ఘటనపై స్పందించిన జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి వెంటనే మార్కెట్కు చేరుకుని రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని, అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం రైతులను సముదాయించి ఆర్డీవో వాహనాన్ని బయటకు పంపించారు.

