కలం, వెబ్డెస్క్: జనసేన (Janasena) పార్టీ, ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) లక్ష్యంగా సాగుతున్న కుట్రపూరిత అవాస్తవ ప్రచారాలపై జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం తీవ్రంగా స్పందించింది. రాజకీయాల పవిత్రతను భ్రష్టు పట్టించడానికి కొందరు క్షుద్రశక్తులు ప్రచార మాధ్యమాలను వాడుకుంటూ, జరగని విషయాలను జరిగినట్లు చూపిస్తూ సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నారని మండిపడింది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర రావు జనసేన పార్టీ, పవన్ కల్యాణ్ను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ ఈ అధికారిక ప్రకటన విడుదల చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
దేశ, రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తున్న జనసేన పార్టీ పైనా, పవన్ కల్యాణ్ పైనా, ఇతర నాయకులపై ఎటువంటి నిందారోపణలు లేదా అవాస్తవాలు ప్రచారం చేసినా ఇకపై ఉపేక్షించేది లేదని పార్టీ స్పష్టం చేసింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా సరే.. వారిపై తక్షణమే పోలీస్ కేసులు నమోదు చేయడంతో పాటు కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం హెచ్చరించింది. మసిపూసి మారేడు కాయ చేసే ఊసరవెల్లి ప్రచారాలకు ఇకపై చట్టపరంగానే బుద్ధి చెప్తామని జనసేన లీగల్ సెల్ తేల్చి చెప్పింది.

