కలం, వెబ్ డెస్క్ : జనసేన పార్టీ తమ రాజ్యసభ అభ్యర్థిని ఖరారు చేసింది. ఈ మేరకు తమ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ (Lingamaneni Ramesh) పేరును ఆ పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో లింగమనేనిని పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
శనివారం మధ్యాహ్నం రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ నామినేషన్ దాఖలు చేస్తారని జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ తెలిపారు. 2015 నుంచి పార్టీతో, పవన్ కళ్యాణ్ తో రమేశ్ అనుబంధం కొనసాగుతుందని వెల్లడించారు. 2019లో ఎన్నికల్లో జనసేన ఓటమి పాలైన.. జనసేన సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ వెంటే లింగమనేని రమేశ్ ఉన్నారని పేర్కొన్నారు. గతంలో తనతో నడుస్తున్న వారికి న్యాయం చేస్తూ పలువురికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్.. రాజ్యసభ అభ్యర్థి ఎంపికలోనూ అదే సూత్రాన్ని పరిగణలోకి తీసుకున్నారని వివరించారు.
మరోవైపు ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండగా.. ఆ నాలుగు స్థానాలు కూటమి ప్రభుత్వానికే చెందనున్నాయి. పొత్తులో భాగంగా టీడీపీకి 3, జనసేనకి ఒక స్థానం కేటాయించారు. జనసేన అభ్యర్థి పేరు ఖరారు అయింది. అయితే టీడీపీ అభ్యర్థులు ఎవరనే విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

