కలం, మెదక్ బ్యూరో : హైదరాబాద్ – ముంబై జాతీయ రహదారి-65పై సంగారెడ్డి నుండి పటాన్చెరు వరకు కొనసాగుతున్న రోడ్డు విస్తరణ, నిర్మాణ పనుల పురోగతిని సంగారెడ్డి (Sangareddy) జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులు, వాటర్ లాగింగ్ పాయింట్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ స్తంభాల తరలింపు, నీటి పైప్లైన్ల షిఫ్టింగ్, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గత ఏడాది ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న బ్లాక్ స్పాట్ల వద్ద తాత్కాలిక భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీలపై స్లాబులు ఏర్పాటు చేసి మూసివేయాలని చెప్పారు.
అవసరమైన చోట వాటర్ పైప్లైన్లను వెంటనే షిఫ్ట్ చేయడంతో పాటు ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ రహదారి రోడ్డు విస్తరణకు ప్రభావితమవుతున్న నివాస భవనాల యజమానులకు పరిహారం చెల్లించి, వాటి తొలగింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ప్రజల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రోడ్డు విస్తరణ పనులు వేగంగా పూర్తిచేయలని కలెక్టర్ అదేశించారు.

