కలం, వెబ్ డెస్క్: ప్రపంచ బాక్సింగ్ వేదికపై భారత బాక్సర్లు సరికొత్త రికార్డులు సృష్టించారు. తాజాగా విడుదల చేసిన వరల్డ్ బాక్సింగ్ ర్యాంకింగ్స్లో భారత్కు చెందిన జైస్మిన్ లంబోరియా (Jaismine Lamboria) మహిళల 57 కేజీల విభాగంలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆసియా ఛాంపియన్లు ప్రియా ఘంఘాస్ (60 కేజీలు), విశ్వనాథ్ సురేష్ (50 కేజీలు) టాప్-3 లోకి దూసుకెళ్లారు. గ్లోబల్ ర్యాంకింగ్స్లో భారత్ తన పట్టును మరోసారి నిరూపించుకుంది.
మహిళల విభాగంలో రికార్డులు
మహిళల 48 కేజీల కేటగిరీలో మీనాక్షి తన నంబర్ వన్ స్థానాన్ని కాపాడుకున్నారు. ప్రీతి మూడో స్థానానికి చేరారు. అరుణ్ధతి చౌదరి (70 కేజీలు), పూజా రాణి (80 కేజీలు), నూపుర్ (+80 కేజీలు) ప్రపంచ రెండో ర్యాంకును సొంతం చేసుకున్నారు. స్టార్ బాక్సర్లు నిఖత్ జరీన్ (51 కేజీలు), లవ్లినా బొర్గోహైన్ (75 కేజీలు) తమ టాప్ స్థానాలను నిలబెట్టుకున్నారు. మహిళల విభాగంలో మొత్తం 10 కేటగిరీలకు గాను 9 విభాగాల టాప్-10 లో భారతీయులే ఉన్నారు.
పురుషుల విభాగంలోనూ జోరు
అంతర్జాతీయ పోటీల్లో వరుస విజయాల తర్వాత సచిన్, నరేందర్ టాప్-5 లోకి ప్రవేశించారు. హితేష్ గులియా ఆరో ర్యాంకును, అభినాష్ జమ్వాల్ ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నారు. ఆకాష్, లోకేష్ కూడా టాప్-10 లోకి అడుగుపెట్టారు. పురుషుల విభాగంలోని 8 కేటగిరీల టాప్-10 లో భారతీయులు చోటు సంపాదించారు.
ఈ విజయాలపై భారత బాక్సింగ్ సమాఖ్య (BFI) అధ్యక్షుడు అజయ్ సింగ్ స్పందించారు. గత కొన్ని ఏళ్లుగా అట్టడుగు స్థాయి నుండి ఇచ్చిన శిక్షణ వల్లే ఈ ర్యాంకింగ్స్ సాధ్యమయ్యాయని తెలిపారు. దాదాపు ప్రతి విభాగంలోనూ భారతీయులు రాణించడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బాక్సింగ్ దేశాలలో ఒకటిగా భారత్ నిలిచిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టాప్-10 లో ఉన్న అథ్లెట్ల జాబితాలో భారత్ ఓవరాల్గా మూడో స్థానంలో ఉంది. మహిళల బాక్సింగ్లో రెండో స్థానంలో, పురుషుల విభాగంలో నాల్గో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా టాప్-3 లో ఉన్న క్రీడాకారుల జాబితాలో మహిళల విభాగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్, వరల్డ్ ఛాంపియన్షిప్లలో సాధించిన విజయాలే ఈ ఎదుగుదలకు కారణమయ్యాయి.ws

