కలం, నల్లగొండ: నల్లగొండ (Nalgonda) జిల్లా ఇరిగేషన్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) సతీష్ చంద్ర (Executive Engineer Satish Chandra) సాగునీటి కాలువలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు పరిధిలోని చందనపల్లి సమీపంలో ఉన్న డీ37 కాలువలో ఆయన మృతదేహం లభ్యమైంది. ఉదయ సముద్రం ప్రాజెక్టులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న సతీష్ చంద్ర, చందనపల్లి వద్ద ఉన్న డీ37 కాలువలో పడి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే సతీష్ చంద్ర మృతిపై ప్రస్తుతం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన కావాలనే కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారా? లేక విధి నిర్వహణలో భాగంగా కాలువను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయారా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఒక ఉన్నతాధికారి ఇలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఇరిగేషన్ శాఖాధికారులు, సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. సతీష్ చంద్ర మృతికి గల కారణాలను అన్వేషించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
Read Also: ఐపీఎల్ టీం హోటల్ రూల్స్పై బీసీసీఐ కొత్త కోడ్ ఆఫ్ కండక్ట్
Follow Us On: Instagram

