కలం, వెబ్ డెస్క్ : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) 19వ సీజన్ నేటి నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది. బెంగళూరులోని ప్రసిద్ధ చిన్నస్వామి స్టేడియం ఈ మహా సంగ్రామానికి వేదిక కాబోతోంది. టోర్నీలో భాగంగా జరగనున్న తొలి మ్యాచ్లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనుండటంతో అభిమానుల్లో అప్పుడే ఉత్కంఠ నెలకొంది. గత సీజన్లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచిన ఆర్సీబీ, ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుండటం విశేషం.
సొంత గడ్డపై తమ సత్తా చాటి సీజన్ను ఘనంగా ప్రారంభించాలని ఆర్సీబీ (RCB) పట్టుదలతో ఉంది. తమ హోమ్ గ్రౌండ్లో ఉన్న అడ్వాంటేజ్ను ఉపయోగించుకుని తొలి విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని ఆ జట్టు యోచిస్తోంది. మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) కూడా ఏమాత్రం తగ్గకుండా సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగుతోంది. గత వైఫల్యాలను అధిగమిస్తూ, పక్కా ప్లాన్తో ఈసారి టైటిల్ రేసులో నిలవాలని ఆరెంజ్ ఆర్మీ ఉవ్విళ్లూరుతోంది.
ఈ సీజన్లో (IPL 2026) మొత్తం పది జట్లు తలపడనుండగా, సుమారు రెండు నెలల పాటు 74 మ్యాచ్లు జరగనున్నాయి. సుదీర్ఘంగా సాగే ఈ క్రికెట్ సీజన్ లో ఏ జట్టు నిలకడగా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పరుగుల వరద పారే చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు జరగబోయే పోరులో టాస్ గెలిచిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి నేటి నుంచి భారత్లో క్రికెట్ పండుగ వాతావరణం మొదలుకానుంది.
Read Also: CSK అభిమానులకు బ్యాడ్ న్యూస్.. IPL మ్యాచ్ లకు ధోని దూరం!
Follow Us On : WhatsApp

